ఏపీలో రాజధాని అమరావతి అక్రమాలపై దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు కృష్ణానది కరకట్టపై విపక్ష చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్ హౌస్ ను జప్తు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది.
దీనిపై ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీఐడీ.. అనుమతి ఇవ్వాలని కోరింది. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు ఇవాళ లింగమనేని గెస్ట్ హౌస్ జప్తుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి రాజధానిలో పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ కు గతంలో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని రాక సందర్భంగా భారీ ఎత్తున భూములు కేటాయించిందని సీఐడీ ఆరోపిస్తోంది. అందుకు ప్రతిఫలంగా కృష్ణానది కరకట్టపై ఉన్న తన గెస్ట్ హౌస్ ను లింగమనేని రమేష్.. మాజీ సీఎం చంద్రబాబుకు ఇచ్చారని చెబుతోంది. దీన్ని క్విడ్ ప్రోగా పేర్కొంటూ జప్తుకు ఆదేశాలు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించింది.
అంతకు ముందే ప్రభుత్వం చంద్రబాబు ఇల్లు అటాచ్ చేసుకునేందుకు సీఐడీకి అనుమతి ఇచ్చింది. దీంతో సీఐడీ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు ముందుగా లింగమనేని రమేష్ కు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. అనంతరం గెస్ట్ హౌస్ జప్తు చేసుకునేందుకు సీఐడీకి అనుమతి ఇచ్చింది. తద్వారా సీఐడీ వినిపించిన క్విడ్ ప్రోకో వాదనతో ఏకీభవించినట్లయింది.
వాస్తవానికి రాజధాని అమరావతిలో భూముల క్రయ విక్రయాలకు సంబంధించి ప్రభుత్వం సీఐడీ సాయంతో గత నాలుగేళ్లలో పలు కేసులు నమోదు చేసింది. అయితే ఇందులో ఆశించిన పురోగతి లభించలేదు. కానీ చంద్రబాబు నివసిస్తున్న గెస్ట్ హౌస్ విషయంలో మాత్రం ప్రభుత్వానికి ఏసీబీ కోర్టు ఆదేశాలతో ప్రభుత్వానికి భారీ ఊరట లభించినట్లయింది. వచ్చే 9 నెలల్లో ఎన్నికలు ఎదుర్కొనేందుకు సిద్దమవుతున్న వైసీపీ సర్కార్ తాజా పరిణామాలతో చంద్రబాబుపై పైచేయి సాధించినట్లయింది.