తెలంగాణ బీజేపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్టీ అధ్యక్ష పదవికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేరు దాదాపు ఖరారైంది. బండి సంజయ్ కు సముచిత ప్రాధాన్యత ఇస్తామని అగ్ర నేతలు చెబుతు న్నారు.
కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగానే ఉంటూ పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. బండిని మార్చటం పైన ఆయన మద్దతు దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బండి సంజయ్ పై సదాభిప్రాయంతో ఉన్న ప్రధాని మోదీ నిర్ణయం ఇప్పుడు కీలకం కానుంది. ఇదే సమయంలో లక్ష్మణ్ కు పిలుపు రావటం కీలకంగా మారుతోంది.
తెలంగాణ బీజేపీలో మార్పుు
తెలంగాణ బీజేపీలో కీలక మార్పులకు నాయకత్వం సిద్దమైంది. పార్టీ బాధ్యతలు బండి సంజయ్ స్థానంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అప్పగించేందుకు సిద్దమైంది. బండి సంజయ్ పైన ఫిర్యాదులు.. పార్టీ నేతల మధ్య విభేదాలు..మూడేళ్ల పదవీ కాలం ముగింపు వంటి కారణాలతో బండిని మార్చాలని ఆలోచన చేస్తున్నారు. బండి సంజయ్ కు కేంద్ర కేబినెట్ లోకి లేదా పార్టీ జాతీయ కార్యవర్గంలో సముచిత ప్రాధాన్యత ఇస్తామని పార్టీ నేతలు చెబుతున్నట్లు సమాచారం.
కిషన్ రెడ్డి తాను మళ్లీ పార్టీ బాధ్యతలు చేపట్టలేనని ఆయన అమిత్ షాకు చెప్పినట్లు తెలిసింది. అయినా కిషన్ రెడ్డి వైపే పార్టీ మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. తెలంగాణ పార్టీ పైన నిర్ణయాలను ప్రధాని తీసుకుంటారని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు. ఈ సమయంలో పార్టీ నాయకత్వం కొత్త ఫార్ముల తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
బాధ్యతల కేటాయింపు
కిషన్ రెడ్డి పార్టీ పగ్గాలు..బండి సంజయ్ కు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం..కాదనుకుంటే పార్టీ జాతీయ కార్యవర్గంలో ప్రాధాన్యత ఇస్తూ..సీనియర్ నేత లక్ష్మణ్కు కేంద్ర మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయి. ఈనేపథ్యంలోనే.. శనివారం జరిగే రాష్ట్రాల మోర్చాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న లక్ష్మణ్ను మరో 2-3 రోజులు ఢిల్లీలో ఉండాల్సిందిగా పార్టీ నేతలు ఆదేశించారు.
ఇదే సమయంలో ఈటల రాజేందర్కు పార్టీ ప్రచార కమిటీ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మేనిఫెస్టో కమిటీ సారథ్యం అప్పగిస్తారని చర్చ జరుగుతోంది. అయితే, తెలంగాణలో పార్టీకి ఊపు తీసుకొచ్చిన బండి సంజయ్ ను ఎన్నికల సమయంలో తప్పిస్తే పెను సంక్షోభం తప్పదని పలువురు సీనియర్ నాయకులు జాతీయ నాయకత్వానికి తేల్చిచెప్పారు. ఇదే విషయమై వారు పార్టీ జాతీయ నాయకత్వానికి లేఖ రాశారు.