దేశ వ్యాప్తంగా టమాటా ధరల మంట కొనసాగుతుంది. నిత్యం మన వంటల్లో ఉపయోగించే టమాటాల ధరలు వంద రూపాయలకు పైగా పలుకుతున్నాయి. ఈ పరిస్థితులు సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అన్న భావన కలిగిస్తున్నాయి.
ఎప్పుడెప్పుడు ధరలు తగ్గుతాయా అని ఎదురు చూస్తున్న వారికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.
ఉత్పత్తి తగ్గడం, మార్కెట్లో టమాటా లకు డిమాండ్ బాగా పెరగడం, ఏప్రిల్, మే నెలల్లో కురిసిన అకాల వర్షాల ప్రభావం టమాట ధరలు పెరగడానికి కారణమైంది. అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా టమాట ధరలు నియంత్రించటం కోసం రంగంలోకి దిగిన వినియోగదారుల వ్యవహారాల శాఖ ధరల నియంత్రణకు టమాటా ఉత్పత్తి, ప్రాసెసింగ్, నిల్వ విషయాల్లో ఏం చేయాలన్న దానిపై టమాటా గ్రాండ్ ఛాలెంజ్ నిర్వహించటానికి రెడీ అయింది.
ఇందులో సూచించిన వివిధ ఆలోచనలను అధ్యయనం చేసి భవిష్యత్తులో టమాటాల ధరలు పెరగకుండా నియంత్రించటం కోసం చర్యలను చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం రెడీ అయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం టమాటా ధరల తగ్గుదల పైన దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే టమాట ధరలు తగ్గుతాయని పేర్కొంది.
దేశవ్యాప్తంగా మండిపోతున్న టమాట ధరలు వచ్చే 15 రోజుల్లో తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. ఉత్పత్తి కేంద్రాల నుండి పంట మార్కెట్లకు చేరడం, వివిధ ప్రాంతాల నుండి టమాటా సరఫరా పెరగడమే ఇందుకు కారణమని ఆయన వెల్లడించారు.
టమాటా గ్రాండ్ ఛాలెంజ్.. మీరు రెడీనా!!
మరో నెలరోజుల్లో టమాటాల ధరలు సాధారణ స్థాయికి తిరిగి వస్తాయని అంచనా వేస్తున్నట్టు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని సొలన్, సిర్ మౌర్ జిల్లా నుంచి ఢిల్లీకి టమాటా సరఫరా మెరుగైందని త్వరలోనే టమాట ధర తగ్గుతుందని చెప్పారు. ఇక తాజాగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి చేసిన ప్రకటనతో సామాన్యులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు.