మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు ఆర్థిక సాయం కొరకు దరఖాస్తుల ఆహ్వానం
* ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి:
మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రెస్ అకాడమీ సిద్ధమైంది. ఈ మేరకు జర్నలిస్ట్ ల సంక్షేమ నిధి ద్వారా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఒక ప్రకటనలో కోరారు. దరఖాస్తులు నిర్ణీత నమూనాలో పూర్తి చేసి సంబంధిత డీపీఆర్వో ద్వారా ధ్రువీకరించాలని దరఖాస్తుతో పాటు డెత్ సర్టిఫికెట్ ఆదాయ కుటుంబ ధ్రువీకరణ పత్రం, జర్నలిస్టు గుర్తింపు కార్డును జతచేయాలన్నారు. ప్రమాదం బారినపడి అనారోగ్య కారణాలతో పని చేయలేని స్థితిలో ఉన్న జర్నలిస్టులు సైతం సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇప్పటికే మీడియా అకాడమీ నుంచి లబ్ధి పొందిన పెన్షన్ పొందుతున్న వారు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులని చెప్పారు.
దరఖాస్తులను ఈ నెల 21లోగా తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ ఇంటి.నం.10-2-1, ఎఫ్డీసీ కాంప్లెక్స్, 2వ అంతస్థు, సమాచార భవన్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్– 500028 చిరునామాకు పంపాలన్నారు. కమిటీ దరఖాస్తులను పరిశీలించి ఆర్థిక సాయాన్ని అందజేస్తుందని తెలిపారు. ఇతర వివరాల కోసం 7702526489 నంబరులో కార్యాలయ అధికారిని సంప్రదించాలని సూచించారు.