- ఐఐటీ పాట్నాలో సీటు పొందిన “మన్యం బిడ్డ కోర్సా లక్ష్మి
- అభినందించి శుభాకాంక్షలు తెలిపిన హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
మన్యం న్యూస్ దుమ్ముగూడెం:
విశేషమైన విద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించి బీహార్లోని ఐఐటీ పాట్నాలో సీటు పొందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం కాటాయగూడ గ్రామానికి చెందిన “కోర్సా లక్ష్మి”ని శుక్రవారం టెలిఫోన్ ద్వారా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అభినందించి మాట్లాడారు. లక్ష్మిని హరియాణా రాజ్ భావనకు వచ్చి ఆతిధ్యం స్వీకరించాలని కోరుతూ భవిష్యత్తులో అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని దత్తాత్రేయ భరోసా కల్పించారు. కోయ గిరిజన దంపతులైన కన్నయ్య శాంతమ్మ దంపతులకు జన్మించిన కొర్స లక్ష్మి బీద కుటుంబంలో జన్మించినప్పటికీ నిరక్షరాస్యతను ఎదిరించి ప్రతిష్టాత్మకమైన ఐఐటీ పాట్నాలో సీటు సాధించడంపై దత్తాత్రేయ సంతోషం వ్యక్తం చేశారు. లక్ష్మి తండ్రి సమీప గ్రామాల్లో ఇంటింటికీ తిరిగి ఐస్ క్రీంలు విక్రయించి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆమె తల్లి ఇంటిని చూసుకుంటుంది. వారికి విద్య లేకపోయినా కోర్సా లక్ష్మిని తల్లిదండ్రులు ఆమెకు జీవితంలో రాణించడానికి అన్ని అవకాశాలను అందించాలన్న తాపత్రయాన్ని నిరాశపర్చకుండా భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉన్నత విద్యా సంస్థలో సీటు సంపాదించిన లక్ష్మి తల్లిదండ్రుల కలలను నిజం చేయడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. స్థానిక గురుకులంలో 7వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యను అభ్యసించిన లక్ష్మికి తన చదువు పట్ల ఉన్న నిబద్ధత ఫలితంగా ఉన్నత శిఖరాలకు ఎదగడం గర్వించదగ్గ విషయం. ఐఐటి పాట్నాల బీటెక్ (ఈ ఈ ఈ)ప్రోగ్రామ్లో సీటు సంపాదించడంపై తెలుగు బిడ్డగా మనందిరికీ గర్వకారణమని గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటుగా పలువురు కొనియాడారు. లక్ష్మి సాధించిన విజయాలు ప్రతిచోటా యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని సవాళ్లతో కూడిన కుటుంబ నేపథ్యంలో కూడా శ్రేష్ఠతను సాధించడానికి అవధులు లేవని రూపిస్తుందని తన ప్రతిభతో లక్ష్మి అందరి మనసులు గెల్చుకుందని, ఐఐటీ పరీక్షల్లో ఆమె అసాధారణ ప్రతిభ కనబర్చినందుకు భవిష్యత్తులో లక్ష్మి తన ప్రతిభతో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.