చందమామ అందిన రోజు
చరిత్ర సృష్టించిన భారత్
చంద్రుడిని ముద్దాడిన విక్రమ్ ల్యాండర్
దక్షిణ ధ్రువంపై అడుగు పెట్టి చరిత్రపుటల్లోకి భారత్
చంద్రుడిపై కాలుమోపిన నాలుగో దేశంగా భారత్
చంద్రయాన్ -3 గ్రాండ్ సక్సెస్
ఉప్పొంగిన భారతీయులు
హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్, మంత్రులు
భారత దేశానికి గర్వకారణం : ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
మన్యంన్యూస్ ప్రత్యేక ప్రతినిధి :
చందమామపై భారత్ చెరగని ముద్రవేసింది. చందమామపై అడుగుపెట్టి చరిత్ర సృష్టించింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ సరికొత్త చరిత్రను లిఖించింది. ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తుండగా.. కోట్లాది భారతీయుల ప్రార్థనలు ఫలించగా.. రెండు రోజులక్రితం రష్యా లూనా-25 మిషన్ కుప్పకూలిన చంద్రుడి దక్షిణ ధృవంపై చంద్రయాన్-3 మిషన్ ‘ల్యాండర్ విక్రమ్’ విజయవంతంగా సాఫ్ట్గా లాండయ్యింది. రాళ్లు, గుంతలు లేని ప్రదేశంలో సురక్షితంగా ల్యాండయ్యింది. ఈ అత్యద్భుత ఖగోళ ఘట్టాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులతోపాటు విదేశీయులు కూడా ఎంతో ఆసక్తిగా తిలకించారు.చంద్రుడిపై పరిశోధనల కోసం గత నెల 14న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 వ్యోమనౌక 41 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత జాబిల్లిపై అడుగుపెట్టింది. బుధవారం సాయంత్రం 6:04 గంటలకు ప్రజ్ఞాన్ రోవర్తో కూడిన విక్రమ్ ల్యాండర్ మాడ్యూల్ చంద్రుని దక్షిణ ధ్రువాన్ని ముద్దాడింది. దీంతో అమెరికా, సోవియెట్ యూనియన్ (రష్యా), చైనా తర్వాత చంద్రునిపై దిగిన నాలుగో దేశంగా భారత్ రికార్డు సృష్టించింది. అలాగే ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యంకాని జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలిదేశంగా భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. చందమామపై విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ విజయవంతమవ్వడంతో బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో శాస్త్రవేత్తలు ఉప్పొంగిపోయారు. ప్రధాని మోడీ, సీఎం కేసిఆర్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ సహా నేతలంతా సంతోషం వ్యక్తం చేశారు. యావత్ దేశం ఈ విజయానికి పులకించిపోయింది. ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఈ విజయం దేశానికి గర్వకారణం అన్నారు.
…