ప్రతి దరఖాస్తు పరిష్కారానికి చర్యలు చేపట్టాలి
* కలెక్టర్ ప్రియాంక అధికారులకు ఆదేశం
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి సమావేశపు హాలులో అన్ని శాఖల జిల్లా అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిద ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల దరఖాస్తులు స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఎండార్స్ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు నిషిత పరిశీలన చేయాలని ప్రతి దరఖాస్తు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సమస్య పరిష్కరించాలని ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు కొన్ని ఇలా ఉన్నాయి. పాల్వంచ మండలం పాత పాల్వంచకు చెందిన పెరుమాళ్ళపల్లి మరియమ్మ జాన్ మోజేష్ తమకు వివాహం జరిగి 35 సంవత్సరాలు తమకి ఒక సంతానమని, కూలి పనులు చేసుకుంటూ ఇన్ని సంవత్సరములు కిరాయి ఇండ్లలో జీవనం కొనసాగిస్తున్నామని తమ ఆర్థిక పరిస్థితి కిరాయి కట్టుకోలేని స్థితిలో ఉన్నందువలన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయవలసిందిగా చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం డి ఆర్ వో కు ఎండార్స్ చేయడం జరిగింది. అశ్వరావుపేట మండలం పాపిడి గూడెంకు చెందిన నాలి మహా లక్ష్మయ్య సర్వే నెo.909/1లో 3 ఎకరాల భూమి కలదని సదరు భూమి తమ ఆధీనంలోనే ఉన్నదని కానీ ధరణి పోర్టల్ నందు అదే గ్రామానికి చెందిన నాగేశ్వరరావు గంగాజలం, లక్ష్మీనారాయణల పేరుమీద అయి ఉన్నాయని వారి పేర్లను ఆన్లైన్ నుంచి రద్దు పరచి అసలు హక్కుదారులైన తమ పేరును ధరణి పోర్టల్ యందు నమోదు చేయవలసిందిగా చేసిన దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం ఆర్ ఏ ఓకు ఎండార్స్ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు రాంబాబు, మధుసూదన్ రాజు, డిఆర్ఓ రవీంద్రనాథ్ అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.