మన్యం న్యూస్,ఇల్లందు:ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ 8వ రాష్ట్ర మహాసభల పోస్టర్లను సోమవారం పట్టణంలోని ఎల్లన్న విజ్ఞాన భవనంలో ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంఘం జిల్లాకార్యదర్శి వాంకుడోత్ అజయ్ మాట్లాడుతూ.. అక్టోబర్ 12, 13 తేదీలలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సంఘ మహాసభలను నిర్వహించడం జరుగుతుందని త్యాగాలకు, పోరాటాలకు పురిటిగడ్డ మానుకోట జిల్లా కేంద్రంలో ఈ మహాసభలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఏడాదికి రెండుకోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువకులకు హామీలు ఇచ్చి అధికార పగ్గాలు చేపట్టిన నరేంద్రమోడీ ఉద్యోగాల కల్పనలో పూర్తిగా విఫలమయ్యాడని అన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో యువతకు ఇంటికో ఉద్యోగం వస్తదని ఆశిస్తే కెసిఆర్ ఊరుకో ఉద్యోగం కూడా ఇవ్వలేదని తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో లక్ష ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదంటే నిరుద్యోగుల పట్ల ఎంత కఠినాత్మకంగా ఉన్నాడో అర్థం చేసుకోవచ్చన్నారు. యువతరం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు పోరాటాలు రూపకల్పన చేసుకునేందుకు ఈ మహాసభలు దోహదపడతాయని ఆశిస్తున్నామని అన్నారు. ఈ మహాసభలకు యువతరం కదిలి వచ్చి జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపందా ఇల్లందు పట్టణ కార్యదర్శి యాకుబ్ షావలి, సిపిఐ ఎంఎల్ ప్రజాపందా జిల్లానాయకులు ఆర్ఎస్సి బోస్, బుర్ర వెంకన్న, పూణేకుమార్, పాయం వెంకన్న తదితరులు పాల్గొన్నారు.





