మనోళ్ళకు బిఫాంలు
ప్రజలకు మ్యానిఫెస్టో వరాలు
కేసీఆర్ ఎన్నికల శంఖారావం
మళ్ళీ మనదే గెలుపు
ఆసరాఫించన్ ఏటా పెంపు రూ.3016 నుండి 5016 దాకా
తెల్లరేషన్ కార్డు దారులకు సన్నబియ్యం
ప్రతీ ఒక్కరికీ కేసీఆర్ భీమా.. జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ బండ
(మన్యంన్యూస్ బ్యూరో, హైదరాబాద్)
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీకి చెందిన మొత్తం 51 మంది అభ్యర్థులకు బీఫామ్స్ అందజేశారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన అభ్యర్థులకు బీ-ఫామ్లు అందజేశారు. భద్రాద్రి జిల్లాకు చెందిన పినపాక అభ్యర్ధి రేగా కాంతారావుతో పాటు ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం అభ్యర్ధులు హరిప్రియ, వనమా వెంకటేశ్వరరావు, మెచ్చా నాగేశ్వరరావు, తెల్లం వెంకట్రావులకు బి-ఫామ్ లు అందజేసిన కేసీఆర్ గెలిచిరావాలని దీవించారు. ఒక్కొక్కరికి ఎన్నికల ఖర్చుల కోసం రూ.40లక్షల చెక్కును అందజేశారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోను తెలంగాణ భవన్లో మీడియా ముఖంగా ప్రకటించారు. ఇందులో అనేక వరాలున్నాయి. మల్ల బిఆర్ఎస్ గెలుస్తుందన్నారు.
మేనిఫెస్టో ఇదే..
రైతుబంధు, దళితబంధును కొనసాగిస్తాం.
రైతుబంధును రూ.16 వేలు చేస్తాం.
ఆసరా పెన్షన్ రూ.2016 నుండి రూ.5016 పెంపు. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం రూ.3016 చేసి 5 సంవత్సరాల్లో రూ.5016కి పెంపు. ఏడాదికి రూ.500 చొప్పున దశలవారీగా పెంపు.
సౌభాగ్యలక్ష్మి పథకం పేరిట అర్హులైన మహిళలకు నెలకు రూ.3000 భృతి.
తెల్ల రేషన్కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ.
దివ్యాంగుల పెన్షన్లు రూ.4016 నుంచి రూ.6 వేలకు పెంచుతాం. ప్రతి ఏటా రూ.300 చొప్పున పెంచుతాం.
తెల్లరేషన్ కార్డుదారులకు రూ.5 లక్షల కేసీఆర్ బీమా.
అక్రెడిటేషన్ ఉన్న జర్నలిస్టులకు రూ.400లకే గ్యాస్ సిలిండర్.
తెలంగాణలో 93 లక్షల పైగా కుటుంబాలకు కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా పథకం 5 లక్షల బీమా కల్పిస్తాం.