మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
కొత్తగూడెంలో నవంబర్ 5 తేదీన జరిగే బీఆర్ఎస్ సభను విజయవంతం చేయాలని కోరుతూ నాయకులకు ఎంపీ రవిచంద్ర దిశానిర్దేశం చేశారు. శనివారం పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య నాయకులకు ఎంపీ రవిచంద్ర పలు సలహాలిచ్చారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో నవంబర్ ఐదవ తేదీన బీఆర్ఎస్ “ప్రజా ఆశీర్వాద సభ” జరగనుందని ఈ భారీ బహిరంగసభలో బీఆర్ఎస్ అధ్యక్షులు, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు తన ప్రభుత్వం చేసిన, ఇక ముందు చేయనున్న అభివృద్ధి పనుల గురించి వివరిస్తారని తెలిపారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగే ఈ సభకు నియోజకవర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించుకోవలసిందిగా ఎంపీ రవిచంద్ర నాయకులకు దిశానిర్దేశం చేశారు. సభకు హాజరయ్యే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా తాగునీటి సీసాలు, మజ్జిగ ప్యాకెట్లు అందించాలని, ఇందుకు చురుగ్గా ఉండే యువకులను వాలంటీర్లుగా పెట్టాల్సిందిగా ఎంపీ రవిచంద్ర సూచించారు. అదేవిధంగా వాహనాలు సకాలంలో సభాస్థలికి చేరుకునేలా ట్రాఫిక్ జామ్ చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవలసిందిగా ఎంపీ వద్దిరాజు నాయకులకు సలహాలిచ్చారు. సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం జెడ్పీ వైఎస్ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర రావు, కొత్తగూడెం మునిసిపల్ వైస్ ఛైర్మన్ వీ.దామోదర్, బీఆర్ఎస్ నియోజకవర్గ సమన్వయకర్తలు సర్థార్ పుటం పురుషోత్తం రావు, ఆది విష్ణుమూర్తి, ప్రముఖ నాయకులు కాసుల వెంకట్, కిలారి నాగేశ్వరరావు, జేవీఎస్ చౌదరి, బత్తుల వీరయ్య, కొత్వాల్ శ్రీనివాస్, మండే హనుమంతరావు, ఎం.ఏ.రజాక్, భీమా శ్రీధర్, రాంబాబు, బరపాటి వాసు, రావి రాంబాబు, కంభంపాటి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.