మన్యం న్యూస్ దుమ్ముగూడెం /భద్రాచలం::
నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోకుండా పక్కా సాక్ష్యాలను సేకరించి, వాటిని కోర్టుకు అందించాలని భద్రాచలం ఏఎస్పీ పరితోష్ పంకజ్ సూచించారు. సంబంధిత ప్రభుత్వ కోర్టు అధికారులతో సమన్వయం చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని ఏఎస్పీ కార్యాలయంలో భద్రాచలం డివిజన్ పరిధిలో గల భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం పోలీస్స్టేషన్లకు సంబంధించిన కోర్టు కానిస్టేబుళ్లతో ఏఎస్పీ పంకజ్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కోర్టు కేసుల్లో నేరస్తులకు తప్పని సరిగా శిక్షలు పడే విధంగా చేయడంలో కోర్టు కానిస్టేబుళ్ల పాత్ర ఎంతో ఉంటుందని, ఇటీవల కాలంలో కానిస్టేబుళ్లు కోర్టులో సరైన సాక్ష్యాలు అందజేయడంతో ఫోక్సో కేసులు నమోదు అయిన ఇద్దరు నింధితులకు శిక్ష పడటం, అదే విధంగా అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న 10 మంది నేరస్తులకు శిక్షలు పడటమే ఇందుకు నిదర్శనం ఆయన అన్నారు. రానున్న కాలంలో కూడా కోర్టు కానిస్టేబుళ్లు విధులను నిబద్ధతతో నిర్వహించి, మంచి పేరు తెచ్చుకోవాలని భద్రాచలం ఏఎస్పీ పంకజ్ కోరారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం టౌన్ సీఐ నాగరాజు రెడ్డి, ఏఎస్ఐ గంజి. శశిదర్, దుమ్ముగుడెం హెడ్కానిస్టేబుల్ రమేష్, కానిస్టేబుల్ నవీన్, చర్ల కానిస్టేబుల్ సురేష్ బాబు, సైదులు పాల్గొన్నారు.