UPDATES  

 తెలంగాణలో రాగల రెండ్రోజులపాటు చలితీవ్రత అత్యధికం ..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా చలి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో చలి మరింత అధికంగా ఉంటోంది. తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత బాగా పెరుగుతోందని తాజాగా, హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల రెండు మూడు రోజులు చలి తీవ్రత అధికంగా ఉంటుందని పేర్కొంది. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

 

రెండు మూడు రోజుల తర్వాత మళ్లీ చలి తీవ్రత సాధారణ స్థితికి వచ్చే ఉందని వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. అయితే, డిసెంబర్ ఆఖరి వారం నుంచి చలి తీవ్రత మరింత పెరగడంతోపాటు శీతల గాలులు వీస్తాయని చెప్పారు. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదవుతాయన్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 12 నుంచి 13 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు.

 

తెలంగాణ రాష్ట్రంలో అత్యల్పంగా మెదక్ జిల్లాలో 12.5 డిగ్రీల ఉష్ణోగ్రత, అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెంలో 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారిణి శ్రావణి తెలిపారు. పగటిపూట ఉష్ణోగ్రతలు సగటున 28 నుంచి 31 డిగ్రీల మధ్య ఉన్నాయన్నారు.

 

అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 31 డిగ్రీలు.. అత్యల్పంగా 28 నుంచి 29 డిగ్రీల మధ్య హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. రెండు రోజులుగా కింది స్థాయి నుంచి తూర్పు దిశగా బలమైన గాలులు వీస్తున్నాయని తెలిపారు. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ అధికారణి తెలిపారు. వృద్ధులు, పిల్లలు ఈ రెండు మూడు రోజులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !