UPDATES  

 ముస్లిం లీగ్‌ జమ్మూ కశ్మీర్‌పై నిషేధం విధించిన మోదీ ప్రభుత్వం..

ముస్లిం లీగ్‌ జమ్మూ కశ్మీర్ పార్టీ(MJLK MA) పై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిషేధం విధించింది. ముఖ్యంగా పార్టీ మసరత్ ఆలం (Masrrat Alam)గ్రూపుపై ఈ ఆంక్షలు విధిస్తూ బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా బుధవారం తెలిపారు.

 

యూఏపిఏ (UAPA- Unlawful Activities Prevention Act) చట్ట ప్రకారం ముస్లిం లీగ్‌ జమ్మూ కశ్మీర్(మసరత్ ఆలం ఫ్యాక్షన్)పై నిషేధం విధిస్తున్నట్లు ట్విట్టర్‌లో అమిత్ షా ఓ పోస్ట్ చేశారు. ఉగ్రవాద చర్యలకు పాల్పడే వారికి ఈ గ్రూపు సహాయం అందిస్తున్న కారణంగా కఠిన నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడించారు.

 

ఉగ్రవాద చర్యలతో శాంతి భద్రలకు భంగం కలిగించి.. జమ్మూ కశ్మీర్‌లో ఇస్లామిక్ పాలన స్థాపించేలా ప్రజలను రెచ్చగొట్టేందుకు ముస్లిం లీగ్‌ జమ్మూ కశ్మీర్ పార్టీలోని మసరత్ ఆలం గ్రూపు ప్రయత్నిస్తోందని అమిత్ షా తీవ్ర ఆరోపణలు చేశారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐకమత్యానికి భంగం కలిగించే వారిపై మోదీ పాలనలో జాలి చూపేది లేదని.. అటువంటి వారిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని అమిత్ షా వ్యాఖ్యానించారు.

 

ముస్లిం లీగ్ జమ్మూ కశ్మీర్‌పై నిషేధం విధించడంతో ఆ పార్టీలో ఎవరైనా పౌరులు సభ్యులుగా చేరితే వారిపై కూడా దేశ ద్రోహం చట్ట ప్రకారం అరెస్టు చేసి కేసు పెడతారు. నిషేధించిన తరువాత.. పార్టీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్స్, ఆస్తులు, ఆఫీసులను ప్రభుత్వం సీజ్ చేసే అవకాశం ఉంది. ఇకపై నుంచి ముస్లిం లీగ్ జమ్మూ కశ్మీర్‌ పార్టీ మసరత్ ఆలం గ్రూపులో ఎవరైనా సభ్యులుగా చేరినా, లేక పార్టీకి చందా ఇచ్చినా అది నేరంగా పరిగణిస్తారు.

 

మసరత్ ఆలం ఎవరు?

 

కశ్మీర్‌లోని ఆల్ పార్టీ హురియత్ కాన్ఫెరెన్స్ అధ్యకుడైన మసరత్ ఆలం భట్ (50).. 2010 జమ్మూ కశ్మీర్ అల్లర్లలో కీలక పాత్ర పోషించాడని ఎన్ఐఏ అధికారులు అతడిని అరెస్టు చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసిన సైనిక చర్యలో 120 మంది కశ్మీర్ యువత చనిపోవడంతో 2010లో జమ్మూ కశ్మీర్‌లో అల్లర్లు చెలరేగాయి.

 

2019 నుంచి మసరత్ ఆలం తీహార్ జైల్లో ఉన్నాడు. మసరత్ ఆలం భట్ కశ్మీర్‌లోని ముస్లిం యువతను అతివాదులుగా మారుస్తున్నాడనే ఆరోపణలున్నాయి.

 

కశ్మీర్ స్థానిక మీడియా ప్రకారం.. మసరత్ ఆలంపై 27 ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయి. పలుమార్లు జైలు కెళ్లిన మసరత్.. 2015లో విడుదలైన తరువాత ఆ సమయంలో అధికారంలో ఉన్న పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ-బీజేపీ కూటమికి వ్యతిరేకంగా కుట్రలు చేసినట్లు అతినిపై కేసులున్నాయి.

 

పాకిస్తాన్ సపోర్టర్ అయిన సయ్యద్ అలీ షా గిలానీ శ్రీనగర్‌లో ఒకసారి ర్యాలీ నిర్వహించగా.. మసరత్ ఆ సమయంలో పాకిస్తాన్‌కు జై కొడుతూ నినాదాలు చేశాడు. ఆ కారణంగా కశ్మీర్ ప్రభుత్వం మసరత్ ఆలంను అరెస్టు చేసి జైల్లో పెట్టింది.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !