ప్రతి సైనికుడు తమకు కుటుంబ సభ్యుడితో సమానమని, ప్రతి భారతీయుడి భావన ఇదేనని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇటీవల జమ్మూ కశ్మీర్లోని పూంఛ్ జిల్లాలో జవాన్లు ప్రయాణిస్తున్న రెండు సైనిక వాహనాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి జమ్ము కశ్మీర్ లో పర్యటించారు. అనంతరం భద్రతా పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా సైనికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
దేశంలోని ప్రతి సైనికుడు మన కుటుంబ సభ్యుడితో సమానమన్నారు. ప్రతి భారతీయుడి భావన ఇదే అన్నారు. మీకు చెడుచేయాలని చూస్తే సహించే ప్రసక్తి లేదని మంత్రి రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్మీపై శత్రు మూకలు చేసే దాడుల్ని అడ్డుకోవడంలో భద్రతా, నిఘా సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. మీరంతా ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారని తెలుసన్నారు. మీ ధైర్యసాహసాలు, త్యాగాలు వెలకట్టలేనివని మంత్రి కొనియాడారు. ఒక సైనికుడు అమరుడైతే.. మేమిచ్చే పరిహారంతో ఆ నష్టాన్ని పూడ్చలేమన్నారు. ప్రభుత్వం ఎప్పటికీ మీ వెంటే ఉంటుందని భరోసా కల్పించారు. మీ భద్రత, సంక్షేమం తమకు అధిక ప్రాధాన్యమని స్పష్టం చేశారు.
ఇటీవల ఆర్మీ ఆపరేషన్లలో లోపాలకు సంబంధించి బ్రిగేడియర్ స్థాయి అధికారి విచారణను ఎదుర్కొంటున్నారు. మరోపక్క పూంఛ్ జిల్లాలో ఆర్మీ కస్టడీలో ఉన్న ముగ్గురు పౌరులు మృతి చెందారు. దీంతో ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతోంది. మరోపక్క ఆర్మీ వాహనాలపై దాడి జరిగింది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కేంద్రమంత్రి పర్యటించారు.