ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందులో ‘కల్కి 2898ఏడీ’ ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం భారీ అంచనాల నడుమ రూపొందుతోంది. ఇందులో దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీశా పటానీ వంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా సెట్స్తో పాటు ఆయుధాలు, ఇతర వస్తువులను సరికొత్తగా ఉండేలా డిజైన్ చేస్తున్నారు మేకర్స్. ఇప్పటి వరకూ భారతీయ సినిమా పరిశ్రమ చూడని సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకాభిమానుల్లో ఎక్కడ లేని అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ మూవీ అభిమానులకు నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారు గుడ్ న్యూస్ చెప్పారు.
ఈ మేరకు ‘కల్కీ 2898 ఏడీ’ రిలీజ్ డేట్ను ప్రకటించారు. ఈ ఏడాది వేసవి కానుకగా అంటే మే 9న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా ‘‘6000 ఏళ్ల క్రితం ముగిసిన కథ.. 2024 మే 9 నుంచి ప్రారంభం కానుంది’’ అంటూ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. ఈ ట్రీట్తో ప్రభాస్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.