కశ్మీర్లో కొత్త శకం ప్రారంభమయ్యిందని.. హర్తాళ్లు, సంఘటిత నిరసనలు, రాళ్ల దాడి యుగం ముగిసిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah)తెలిపారు. జమ్మూ-కశ్మీర్లో ఆర్టికల్ 370 (Article 370) రద్దు తర్వాత ఉగ్రవాద సంబంధిత ఘటనలు 66 శాతం తగ్గుముఖం పట్టినట్లు వెల్లడించారు. సిటిజన్స్ హత్యల్లో 81 శాతం, సెక్యూరిటీ సిబ్బంది మరణాల్లో 48 శాతం తగ్గాయని తెలిపారు. కశ్మీర్లో శాంతియుగం ప్రారంభమైందని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కశ్మీర్ ప్రాంతం ఉగ్రవాదం నుంచి పర్యాటకం వైపు మళ్లుతోందన్నారు అమిత్ షా. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జమ్మూలో 100 ఈ-బస్సులను అమిత్ షా ప్రారంభించారు. స్థానికంగా ప్రభుత్వ, కారుణ్య ఉద్యోగాలకు ఎంపికైన వారికి ఆయన నియామక పత్రాలు అందజేశారు. స్థానిక యువత ఓటర్లుగా నమోదు చేసుకుని, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగం కావాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ..2000వ సంవత్సరంలో 2,654 రాళ్ల దాడి ఘటనలు జరిగాయని తెలిపారు. 2010లో రాళ్ల దాడుల్లో 112 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయన్నారు. 2023లో ఇటువంటివి ఒక్కటీ చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. స్థానికంగా ఉగ్ర కార్యకలాపాలకు నిధుల ప్రవాహాన్ని అరికట్టామని స్పష్టం చేశారు. ఆస్తులను అటాచ్ చేస్తున్నామని.. అనేక ఉగ్ర సంస్థలపై నిషేధం విధించామని తెలిపారు. బాంబు పేలుళ్లు, కాల్పులు, బంద్లు.. విద్యాసంస్థలు, పరిశ్రమలు, మౌలిక సదుపాయాలతో భర్తీ అవుతున్నాయన్నారు. ఇది అతిపెద్ద మార్పు అని పేర్కొన్నారు. 2019-20లో జమ్మూ- కశ్మీర్కు రూ.297 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. 2022-23లో రూ.2,153 కోట్లకు పెరిగాయని.. మరో రూ.6,000 కోట్లు రానున్నాయని అమిత్ షా తెలిపారు.
జమ్మూ-కశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించే ‘ఆర్టికల్ 370’ని 2019 ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలు జమ్మూ-కశ్మీర్, లద్ధాఖ్గా విభజించింది కేంద్రం.