ఐసీసీ అవార్డుల పంట పండింది. క్రికెట్ ప్రపంచంలో ఏ అవార్డు ప్రకటించినా సరే, అందులో మన టీమ్ ఇండియా క్రికెటర్లలో ఎవరో ఒకరు ఉండాల్సిందే. ఇప్పుడు అలాంటి అవార్డు అందుకున్న విరాట్ కొహ్లీ క్రికెట్ చరిత్రలో ఒక సరికొత్త రికార్డ్ సృష్టించాడు. 2023 సంవత్సరానికి ఐసీసీ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు. అంతేకాదు ఈ అవార్డును ఎక్కువ సార్లు అందుకున్న ఆటగాడిగా ఒక సరి కొత్త రికార్డు క్రియేట్ చేశాడు.
2012, 2017, 2018 ల్లో ఐసీసీ వన్డే క్రికెటర్గా కొహ్లీ ఎంపికయ్యాడు. అంతేకాదు క్రికెటర్ ఆఫ్ ది డెకడ్ (దశాబ్ది క్రికెటర్) అవార్డు కూడా తనకే దక్కింది. ఇకపోతే 2017, 2018ల్లో క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలిచాడు. 2019లో స్పిరిట్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యాడు. ఇలా వీటన్నింటినీ లెక్కేస్తే విరాట్ కొహ్లీ మొత్తం 10 ఐసీసీ అవార్డులను సాధించాడు. ఈ నేపథ్యంలో విరాట్ కి దరిదాపుల్లో మరెవరూ లేకపోవడం విశేషం. మహేంద్ర సింగ్ ధోనీ కుమార సంగక్కర ఇద్దరూ కూడా చెరో నాలుగుసార్లు ఐసీసీ అవార్డు దక్కించుకున్నారు.
2023 సంవత్సరానికి వస్తే, కొహ్లీ తర్వాత క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గా ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఎంపికయ్యాడు. ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు ఉస్మాన్ ఖవాజా ఎంపికయ్యాడు.
ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ గా సూర్యకుమార్ యాదవ్
ఎంపికైన సంగతి తెలిసిందే. ఇలా రెండు ఫార్మాట్లలో మనవాళ్లు ఇద్దరు ఉండటం టీమ్ ఇండియా గొప్పతనమని నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ఐసీసీ ఉమెన్ అవార్డులు 2023కి ఎంపికైన వారిలో ఒక్కరు కూడా టీమ్ ఇండియా మహిళా జట్టు నుంచి లేకపోవడం విచారకరమని అంటున్నారు. వరుసగా అవార్డ్ గ్రహీతలు …
క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – నాట్ సివర్ (ఇంగ్లాండ్)
ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – ఫోబే లిచ్ఫీల్డ్ (ఆస్ట్రేలియా)
వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – చమరి ఆటపట్టు ( శ్రీలంక)
అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – క్వింటర్ అబెల్ ( కెన్యా )
టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ – హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్ )
వీరే కాకుండా ఇతర అవార్డులు కూడా వచ్చాయి. వాటిలో ఐసీసీ అంపైర్ ఆఫ్ ది ఇయర్ – రిచర్డ్ ఇల్లింగ్వర్త్ కి దక్కింది. ఇకపోతే ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును జింబాబ్వే దక్కించుకుంది.