టాలీవుడ్లో ఒకప్పుడు ఏ చిన్న ఈవెంట్ జరిగినా పెద్ద హీరో, చిన్న హీరో అన్న తేడా లేకుండా అంతా ఒక్కటై వేడుకకు హజరయ్యే వారు. ఎన్ని విబేధాలు ఉన్నా.. వాటిని పక్కన పెట్టి ఈవెంట్ను గ్రాండ్గా జరుపుకునే వారు. ఆ టైంలో వాళ్లందరినీ చూడటానికి రెండు కళ్లు సరిపోయేవి కాదు. అంతా ఒక కుటుంబం అన్నట్లుగా సందడి చేసేవారు.
అయితే ఇప్పుడంతా మారిపోయిందనే చెప్పాలి. ఎవరి వ్యాపారం వాళ్లది, ఎవరి స్వార్థం వాళ్లది. ఎవరికి వారే అన్నట్లు టాలీవుడ్ తయారైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా ఓ పెద్ద సందర్భం వచ్చినా.. కలిసి వేడుక చేసుకునే నాథుడే లేకపోయాడు. ఆ ఆలోచన వచ్చినా.. హా.. మనకెందుకులే.. మనఇంట్లో వేడుక కాదుకదా..! అన్నట్లుగా ఉండిపోతున్నారనే చర్చ నడుస్తోంది. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ స్థాయికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఎంతో గ్రాండ్గా.. భారీ స్థాయిలో సంబరాలు చేసుకోవాల్సింది పోయి.. టాలీవుడ్లో ఓ నిశ్శబ్ద వాతావరణం కనిపించింది. ప్రముఖ సినీ సెలబ్రెటీలు ట్వీట్లు వేసి మమ అనిపించుకున్నారు.
ఇదేగాక మొన్నటికి మొన్న టాలీవుడ్ హీరో అల్లు అర్జున్కి ఎంతో ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు వచ్చింది. అయితే అప్పుడు కూడా టాలీవుడ్ స్పందన ‘నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది’. ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేయాల్సిన సందర్భాన్ని చాలామంది ప్రెస్ నోట్లకు పరిమితం చేశారు. సినిమాలు పెద్ద సక్సెస్ అయినప్పుడు సెలబ్రేట్ చేసుకోవడం చేసుకోకపోవడం పక్కన పెడితే.. కనీసం జాతీయ అవార్డు, ఆస్కార్ అవార్డు లాంటి ప్రతిష్టాత్మక ఘనతల్ని కూడా చూసి చూడనట్టు పట్టించుకోకపోతే ఎలా..? అనే సగటు సినీ అభిమానులు మదనపడుతున్నారు.
ఇప్పుడు అలాంటి సందర్భమే మరోసారి వచ్చింది. తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ‘పద్మ’ అవార్డులను ప్రకటించింది. ఇందులో చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు వరించింది. మరి ఈ సారి అయినా.. టాలీవుడ్ అంతా ఈ ఘనతను సెలబ్రేట్ చేసుకుంటుందా..?. హీరోలంతా ఒకే వేదికపైకి వస్తారా..?. బేధాలు, విభేదాలు పక్కన పెట్టి కలుస్తారా..? లేదో చూడాలి.
ఈ విషయంపై నెటిజన్లు కూడా పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి సేవల్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ ప్రకటించింది. టాలీవుడ్ కూడా ఆయనకు అలాంటి గౌరవం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని కామెంట్లు పెడుతున్నారు. చిరంజీవిని ఘనంగా సత్కరించడం ద్వారా.. టాలీవుడ్లో తామంతా ఒక్కటే అన్న భావన అందరికీ తెలియజేయడానికి ఇదొక అద్భుతమైన సందర్భం అని వారు అంటున్నారు.