బీజేపీని ఆపగలిగే శక్తి కేవలం ప్రాంతీయ పార్టీలకే ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీ పార్టీకి కాంగ్రెస్ ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదన్నారు. కాంగ్రెస్ కు దమ్ముంటే వారణాసిలో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. ఆ పార్టీకున్న 40 స్థానాలను నిలబెట్టుకునే అవకాశం లేదంటూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్టీ చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నట్లు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ వ్యవహారశైలి వల్లనే ఇండియా కూటమి చెల్లా చెదురవుతోందని కేటీఆర్ అన్నారు. దీనిపై ఆ నేతలు ఆత్మపరీశీలన చేసుకోవాలని సూచించారు. దేశంలో బీజేపీని మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, కేసీఆర్ వంటి బలమైన నాయకులే అడ్డుకోగలరన్నారు.
గుజరాత్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో బీజేపీతో నేరుగా పోటీ పడాల్సి ఉన్న కాంగ్రెస్, ఆ రాష్ట్రాలను వదిలిపెట్టి ఇతర రాష్ట్రాల్లో ఇతర పార్టీలతో పోటీ పడుతోందని ఆరోపించారు. దీంతో బీజేపీకి లాభం చేకూరుతుందన్నారు. ఇండియా కూటమిలో ఉన్న ప్రాంతీయ పార్టీల గెలుపు అవకాశాలను దెబ్బతీసేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కేటీఆర్ విమర్శించారు.