వైసీపీలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఎపిసోడ్ కాకరేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆయన సీఎం జగన్ తో భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ను కలిశారు.
గత కొంతకాలంగా బాలినేని అసంతృప్తితో ఉన్నారన్న ప్రచారం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. బాలినేనితో సీఎం జగన్ బుజ్జగింపు ధోరణితో మాట్లాడారు. గత మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ సమయంలో బాలినేని మంత్రి పదవిని కోల్పోయారు. ఇటీవల ఆయన వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి కూడా రాజీనామా చేశారు. బాలినేని ఇప్పటివరకు నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. పార్టీపై అలక కారణంగానే ఆయన ఈ పదవి నుంచి వైదొలిగారంటూ కథనాలు వచ్చాయి.