దేశంలో పంటలకు కనీస మద్దతు ధర(Minimum Support Price) హామీ కల్పించే చట్టం అమలు కోసం బంద్ పాటించాలని రైతు సంఘాలు తీర్మానించాయి. ఈ మేరకు ఫిబ్రవరి 16న భారత్ బంద్కు పిలుపునిచ్చినట్లు భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ ప్రతినిధి రాకేశ్ టికాయత్(Rakesh Tikait) తెలిపారు. వ్యాపార, రవాణా సంఘాలు,ప్రజలను ఈ బంద్కు మద్దతు తెలపాలని కోరారు.
దేశంలో రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 16వ తేదీన భారత్ బంద్ పాటించాలని తీర్మానించామని టికాయత్ తెలిపారు. ఈ బంద్లో దేశంలోని అన్ని రైతు సంఘాలు పాల్గొంటాయని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా రైతులు పనులకు వెళ్లకుండా వ్యవసాయ సమ్మె పాటించాలన్నారు. అమావాస్య రోజు రైతులు పనులకు వెళ్లరని.. ఫిబ్రవరి 16 కూడా రైతులకు అమావాస్య లాంటిదేనని అన్నారు. ఈ బంద్కు వ్యాపార వర్గాలు దుకాణాలు మూసి మద్దతు తెలపాలని కోరారు. పంటకు మద్దతు ధర కల్పించే చట్టం అమలు, నిరుద్యోగం(Unemployment), అగ్నివీర్(Agniveer) పథకం వంటి ఎన్నో సమస్యల పరిష్కారానికి అన్ని వర్గాలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమ్మె ద్వారా ప్రభుత్వానికి గట్టి సందేశాన్ని పంపాలని అని రాకేశ్ టికాయత్ స్పష్టం చేశారు.