ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వికేంద్రీకరణకు మద్దతుగా రాయలసీమ గర్జన కార్యక్రమం నిర్వహించిన విషయం తెలిసిందే. రాయలసీమ మేధావులు మరియు ప్రజా సంఘాల సభ అన్నట్లుగా ప్రచారం జరిగినా కూడా పూర్తిగా వైకాపా శ్రేణులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. మంత్రులు, వైకాపా ఎమ్మెల్యేలు మరియు వైకాపా ముఖ్య నాయకులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఈ కార్యక్రమం ను సక్సెస్ చేసేందుకు స్థానిక నేతలు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేశారు.
మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యే విధంగా డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు అంతా కూడా ఈ మీటింగ్ కి హాజరు అవ్వాలి అంటూ వైకాపా నేతల నుండి సందేశాలు వెళ్ళాయట. డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళలు ఈ మీటింగ్ కి హాజరు కాకపోతే ఒక్కొక్కరికి 100 రూపాయలు చొప్పున ఫైన్ పడుతుంది అంటూ కూడా సంఘాల ప్రతినిధులకు మెసేజ్ లు వెళ్లాయి అంటూ విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. ఆ విషయాన్ని వైకాపా శ్రేణులు మాత్రం కొట్టి పారేస్తున్నారు. విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. రాయలసీమ గర్జన పార్టీలకు అతీతంగా జరిగింది అంటూ వైకాపా నాయకులు మరియు ఇతర సభ నిర్వాహకులు అంటున్నారు. అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.