నిజంగానే బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఇది.! తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో తెరపైకొచ్చిన ‘ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారం’ కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులు వేసిన పిటిషన్పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తీర్పు వెల్లడించిన న్యాయస్థానం, సీబీఐ విచారణకు ఆదేశించడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర సమితి (ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితిగా మారింది) ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కేంద్రంగా ఈ వ్యవహారం నడిచింది. ఆయన్ని ఓ ఇద్దరు స్వామీజీలు, ఓ వ్యాపారస్తుడు కలిసి, మొత్తం నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారేలా డీల్ సెట్ చేశారు.
ప్లేటు మార్చిన రోహిత్ రెడ్డి.. ఎమ్మెల్యేల కొనుగోళ్ళ వ్యవహారానికి సంబంధించి, తన వద్దకు వచ్చినవారిని బురిడీ కొట్టించారు పైలట్ రోహిత్ రెడ్డి . పోలీసులకు సమాచారం ఇచ్చి, వారిని పట్టించారు. ఈ కేసులో ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేయగా, ఆ వ్యవహారం పెను రాజకీయ దుమారానికి కారణమైంది. ఈ ఘటనపై సీబీఐ విచారణ కోరుతూ నిందితులు పిటిషన్ దాఖలు చేయడంతో వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ రంగ ప్రవేశం చేస్తే.. ఈ కేసులో ఎలాంటి సంచలనాలు వుంటాయో ఏమో.! తెలంగాణ సిట్ బృందం విచారణతో న్యాయం జరగదని నిందితులు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.