మన్యం న్యూస్, అశ్వారావుపేట, జనవరి 20 అశ్వారావు పేట మండలం స్థానిక ఎస్బిఐ బ్యాంక్ ఉద్యోగులు ఈనెల 30 ,31న బంద్ చేయుచున్నట్లు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ బ్యాంకుల ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. ఈ నెల 30, 31 తేదీల్లో రెండు రోజుల పాటు సమ్మె చేపట్టనున్నట్లు వివిధ బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్ బి యు) గురువారం ప్రకటిచింది. ఈ మేరకు ముంబైలో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు యుఎఫ్ బి యులో ప్రధాన సంఘంగా ఉన్న అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఎఐబిఇఎ) ప్రధానకార్యదర్శి సిహెచ్ వెంకటాచలం తెలిపారు. సమస్యలు పరిష్కరించాలని పదేపదే డిమాండ్ చేస్తున్నా భారత బ్యాంకుల సంఘం (ఐబిఎ) తమ గోడు వినడం లేదని, అందుకనే సమ్మె అనివార్యమైందని ఆయన తెలిపారు. ప్రధానంగా బ్యాంకింగ్ రంగంలో ఐదు రోజుల పని వేళలు అమలుచేయాలని, ఫించను పెంచాలని, అలాగే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్ పిఎస్)ను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో పాటు వేతన సవరణ కోసం ఉద్యోగులు చేస్తున్న డిమాండ్లపై తక్షణ చర్చలు జరపాలని, అన్ని కేడర్లలోనూ ఖాళీలను భర్తీ చేయడంతో పాటు పని ఒత్తిడికి తగినట్టుగా నియామకాల సంఖ్య పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోట వివేక్ ఎన్ ప్రతాప్, బి ఉపేందర్, కె సూరజ్ కుమార్, ఎన్ బాబు పాల్గొన్నారు.
