మన్యం న్యూస్, అశ్వారావుపేట, జనవరి 23: బడివయసు కలిగిన పిల్లల్ని దుకాణాల్లో పనిచేయించరాదంటూ అశ్వారావుపేట సిఆర్పి ప్రభాకరాచార్యులు ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు లేఖను అందించారు. ఈమేరకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంకా ప్రసాద్ ను కలిసి సోమవారం లేఖ అందించి ఛాంబర్ లోని సభ్యులందరికి ఈ విషయాన్ని తెలియచేయవల్సిందిగా కోరారు. విద్యాహక్కు చట్టం, బాలకార్మికుల చట్టం ప్రకారం 6 నుండి 19 సంత్సరాల పిల్లలతో పనిచేయించరాదని 9వ తేదీనుండి అశ్వారావుపేటలో నిర్వహించిన సర్వే ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులు కొంతమంది తమ పిల్లలు షాపులలో పనిచేస్తున్నట్లు తెలిపారని, ఒక వేళ ఎవరైనా దుకాణాల్లో పనిచేస్తున్నట్లయితే వారిలో 6 నుండి 14 సంవత్సరాల వారిని బడిలో చేర్పించుటకు, 15 నుండి 19 సంవత్సరాల వారిని ఓపెన్ స్కూల్ విధానం ద్వారా 10వతరగతి, ఇంటర్మీడియట్ ను చదివించుటకు సహకరించవలసినది గాను, అశ్వారావుపేటలో బాలకార్మిక నిషేధానికి తమ వంతు కృషి చేయవలసినది గాను ఈ లేఖ ద్వారా కోరారు. ప్రతి షాపులోను మావద్ద బాలకార్మికులు లేరు అనే బోర్డును ప్రదర్శింపచేయించమని కోరారు. ఛాంబర్ అధ్యక్షులు సంకా ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి షాపు యజమానికి ఈ సమాచారాన్ని చేరవేస్తామని బాలకార్మికులుగా విద్యార్ధులు షాపుల్లో పనిచేయకుండా కృషి చేస్తామని అన్నారు.