మన్యం న్యూస్, భద్రాచలం :
తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర కేంద్ర పథకాలు రాష్ట్రంలో అమలు చెయ్యాలి అని కేంద్ర సహాయ మంత్రి బి.ఎల్.వర్మ అన్నారు. సోమవారం భద్రాచలంలో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి బి.ఎల్.వర్మ ముందుగా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం లోని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కేంద్ర సహాయ మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. తదనంతరం పట్టణంలోని వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ, కేంద్ర పౌరసరఫరాల శాఖ మంత్రి బి ఎల్ వర్మ మాట్లాడుతూ… తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా సీఎం కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీ నుంచి 100 పైసలు ప్రజలకు పంపితే 15 పైసలు అందేవని, ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బటన్ నొక్కితే 100 పైసలు ప్రజల జన్ ధన్ ఖాతాలో చేరుతున్నాయని అన్నారు. సీఎం కేసీఆర్ భద్రాద్రి రామయ్య ఆలయ అభివృద్ధి కోసం వంద కోట్లు ఇస్తానని చెప్పి మోసం చేశారని విమర్శించారు. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం 100 కోట్ల ప్రసాద స్కీం కింద భద్రాచలం కి 40 కోట్ల నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ పేరు పెట్టుకుని ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర కార్యదర్శి కుంజ సత్యవతి, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎర్రం రాజు బెహరా, ఆ పార్టీ మండల కార్యదర్శి ములిసేటి మోహన్ రావు, జిల్లా కార్యదర్శి నిడదవోలు నాగబాబు, సీనియర్ నాయకులు పి.సి.కేశవ, మండల ఉపాధ్యక్షులు సూరత్ చంద్రన్, మాదారపు వెంకటేశ్వర్లు, చెల్లబోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు.