మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి జనవరి 25.. ఓటరు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నిష్పక్షపాతంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ అండ్ జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ తెలిపారు. బుధవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయం నుంచి పోస్టాఫీసు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోస్టాఫీసు సెంటర్లో మానవహారం నిర్వహించి ఓటు హక్కు వినియోగంపై ప్రతిజ్ఞ చేపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోని గిరిజనులను, యువతను ఓటర్లుగా నమోదు చేసేందుకు ప్రత్యేక క్యాంపులు నిర్వహించి ఓటరుగా నమోదు చేశామని చెప్పారు. పూసుగూడెం వంటి మారుమూల ప్రాంతాల్లో సైతం నిర్వహించిన ప్రత్యేక క్యాంపులు నిర్వహించడం వల్ల జిల్లాలో 10,298 మంది నూతన ఓటర్లు ఓటు హక్కు పొందారని చెప్పారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమానికి చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయని, కృషి చేసిన బూతుస్థాయి, సహాయ ఎన్నికల రిటర్నింగ్, నియోజకవర్గ రిటర్నింగ్ అధికారులను అభినందించారు. ఇదే స్పూర్తితో ప్రతి ఒక్కరూ తమ ఓటుహక్కును వినియోగించుకుని నూరు శాతం ఓటింగ్ జరిగే విధంగా చేయాలని చెప్పారు. ఓటుహక్కు వినియోగంలో మన జిల్లా రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా నిలవాలని చెప్పారు. యువతతో పాటు వృద్ధులు, ట్రాన్స్ జెండర్లు, దివ్యాంగులు ఓటు నమోదు కొరకు చేసిన ప్రత్యేక క్యాంపులు వల్ల రాష్ట్రస్థాయిలో మన జిల్లాకు ఎన్నికల సంఘం అవార్డు ప్రకటించిందని, ఇది మనం చేసిన కృషికి, మన జిల్లా ప్రజలకు లభించిన గౌరవమని చెప్పారు. పోలింగ్ రోజున ప్రభుత్వ సెలవు అని ఓటుహక్కు వినియోగించుకోకుండా ఉండొద్దని, పవిత్రమైన ఓటుహక్కును తప్పకుండా వినియోగించుకోవాలని చెప్పారు. ఓటుహక్కు పవిత్రపై ఈ రోజు మనందరం ప్రతిజ్ఞ చేశామని ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా నచ్చిన వారికి నిర్భయంగా ఓటు వేసే విధంగా మనందరం కట్టుబడి ఉండాలని చెప్పారు. శని, ఆదివారాల్లో ఓటరు నమోదు కొరకు నిర్వహించిన ప్రత్యేక క్యాంపుల్లో బూతుస్థాయి అధికారుల సేవలను ఆయన అభినందించారు. ఒకవైపు ఉద్యోగ విధులు నిర్వహిస్తూనే ఎన్నికల సంఘం ఆదేశాలు మేరకు ఓటరు నమోదు, మార్పులు చేర్పులు వంటి కార్యక్రమాలను నిర్వహించారని చెప్పారు. జిల్లాలోని 1098 పోలింగ్
కేంద్రాల పరిధిలో చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు, సవరణ కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఓటుహక్కును గౌరవించే పౌరుడిగా దేశవ్యాప్తంగా జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని చెప్పారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలలో 914245 మంది ఓటర్లున్నారని చెప్పారు. నూతనంగా ఓటుహక్కు పొందిన వారిని ఈ సందర్భంగా కలెక్టర్ అభినందించి శుభాకాంక్షలు తెలిపి, ఎన్నికల గుర్తింపు కార్డును అందచేశారు. మిగిలిన వారికి పోస్టల్ శాఖ ద్వారా ఇంటికి ఎన్నికల గుర్తింపు కార్డులు పంపనున్నట్లు చెప్పారు. అనంతరం ఓటుహక్కుపై పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందచేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, ఆర్ అండ్ బి ఈఈ భీమ్లా, పంచాయతీరాజ్ ఈఈ సుధాకర్, సహాకార అధికారి వెంకటేశ్వర్లు, ఉదాన్య అధికారి మరియన్న, మైనింగ్ అధికారి జైసింగ్, మార్కెటింగ్ అధికారి అలీం, మైనార్టీ సంక్షేమ అధికారి సంజీవరావు, డిఆర్ఓ అశోక్ చక్రవర్తి, ఆర్డీఓ స్వర్ణలత, తహసిల్దార్లు రామక్రిష్ణ, రంగప్రసాద్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు యంఏ రాజు తదితరులు పాల్గొన్నారు