మన్యం న్యూస్, సారపాక / బూర్గంపాడు , జనవరి 25
సుమారు 53.15 లక్షల విలువ గల 265 కేజీల గంజాయిని బుధవారం బూర్గంపాడు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ సందర్భంగా బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న సీఐ నాగరాజు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి… బుధవారం ఉదయం 8 గంటల నుంచి బూర్గంపాడు ఎస్సై పి.సంతోష్ తన సిబ్బందితో కలిసి మొరంపల్లి బంజర జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 9.15 సమయంలో భద్రాచలం వైపు నుంచి ఒక ఐచర్ వ్యాన్ రావడానికి గమనించి పోలీసులు వ్యానును ఆపగా వారు ఆపకుండా ముందుకు వెళ్లడంతో పోలీసులు ఆ వ్యానును వెంబడించి జింకల గూడెం సమీపంలో వ్యానుని పట్టుకొని అందులో ఉన్న వ్యక్తులను విచారించగా వారు మహారాష్ట్ర ఉస్మానాబాద్ కు చెందిన మహదేవ్ మోహన్, కిషన్ కాళిదాసు పవర్ లు గా గుర్తించారు. వ్యాన్లో తనిఖీ చేయగా 265.కేజీల గంజాయిని గుర్తించినట్లు వెల్లడించారు. గంజాయి తరలిస్తున్న వ్యాన్ లో ఉన్న వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా చింతూరు నుంచి గంజాయి అక్రమ రవాణ చేస్తున్నట్లు అంగీకరించారు. వారితోపాటు వారి ఓనర్ పప్పు మామ, సత్యజిత్ అనే వ్యక్తులు వారికి సహకరించినట్లుగా విచారణలో తెలిసిందని సిఐ వెల్లడించారు. బుధవారం ఉదయం చింతూరు నుంచి ఐచర్ వ్యాన్ ని ఉస్మానాబాద్ తీసుకుని వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. పప్పు మామ, సత్యజిత్ కారులో పారిపోయారని వారిని సైతం అదుపులోకి తీసుకొని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని సిఐ నాగరాజు తెలిపారు. పట్టుకున్న గంజాయి విలువ 53,15,000/- రూపాయాలు ఉంటుందని సిఐ నాగరాజు తెలిపారు. భారీ స్థాయిలో గంజాయిని అత్యంత చాకచక్యంగా వెంబడించి పట్టుకున్న బూర్గంపాడు పోలీస్ సిబ్బందిని సిఐ నాగరాజు అభినందించారు. ఈ కార్యక్రమంలో సిఐ నాగరాజు తో పాటు బూర్గంపాడు ఎస్ఐ పి. సంతోష్, అదనపు ఎస్ఐలు రమణారెడ్డి, ఏసుబాబు, ఏఎస్ఐ వై.వి.వి సత్యనారాయణ, కానిస్టేబుల్ రామకృష్ణ తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.