బడ్జెట్ భద్రాచలం వాసులకు నిరాశనే మిగిల్చింది
– ప్రతిపక్షానికి ప్రజలపై ప్రేమ లేదు
మన్యం న్యూస్, భద్రాచలం, ఫిబ్రవరి 06
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ భద్రాచలం వాసులకు నిరాశనే మిగిల్చిందని, ప్రతిపక్షానికి సైతం భద్రాచలం ప్రజలపై ప్రేమ లేదని, ప్రతిపక్షం ప్రజా సమస్యలపై గళం విప్పాలని, అవసరమైతే బాయికాట్ చేయాలని సిపిఎం భద్రాచలం నియోజకవర్గ కన్వీనర్ మచ్చ వెంకటేశ్వర్లు అన్నారు. గతంలో తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక హామీలు భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి ఇవ్వడం జరిగిందని వాటిపై నోరు మెదపలేదని ఆయన అన్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన సందర్భంగా తలెత్తినటువంటి సమస్యలు, అందులో భాగంగా భద్రాచలం ప్రాంతానికి జరిగిన అన్యాయం గురించి ఈ బడ్జెట్ లో ప్రస్తావించకపోవడం అత్యంత దారుణమని అన్నారు. పోలవరం బ్యాక్ వాటర్ వలన భద్రాచలం నియోజకవర్గానికి ముఖ్యంగా భద్రాచలం పట్టణానికి జరిగిన అన్యాయాన్ని ఏ రూపంలో పూడుస్తారో ఈ బడ్జెట్లో ప్రకటిస్తారని ఎదురుచూసిన ప్రజలకు నిరాశే మిగిలిందని అన్నారు. కరకట్ట ఎత్తు పెంచి భద్రాచలం రాముడితో పాటు ప్రజలను కాపాడడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆశించినటువంటి ప్రజలకు ఈ బడ్జెట్ నిరాశ మిగిల్చిందని విమర్శించారు.