మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 08.. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన కాళ్ళూరు యతిరాజ్ కుమార్ (ఏబిఎన్ రాజు)కు సిపిఐ నేతలు నివాళులర్పించారు. జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలోని బస్టాండ్ సెంటర్, చిల్డ్రన్ పార్కువద్ద రాజు జ్ఞాపకార్ధం బుధవారం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన రాజు చిత్రపఠం వద్ద మౌనం పాటించి నివాళులర్పించిన అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా మాట్లాడుతూ జర్నలిస్టు సంఘం నాయకుడిగా, జర్నలిస్టుగా తోటి జర్నలిస్టులకు, యాజమాన్యానికి నిస్వార్ధంగా సేవలందించాడని, సమస్యల పరిష్కారం కోసం జర్నలిస్టులను ఏకంచేసి పోరాటాల వైపు నడిపించాడన్నారు. చాలీచాలనీ వేతనాలతో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం అదుకోవాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. మృతుడు రాజు కుటుంబానికి ప్రభుత్వం, ప్రెస్ అకాడమీ నుంచి సహకారం అందించాలని కోరారు. నివాళులర్పించిన వారిలో బందెల నర్సయ్య, దుర్గరాశి వెంకటేశ్వర్లు, వై.శ్రీనివాసరెడ్డి, సలిగంటి శ్రీనివాస్, మైనార్టీ సంఘాల రాష్ట్ర నాయకులు నయిమ్ ఖురేషి, సిపిఐ జిల్లా సమితి సభ్యులు వాసిరెడ్డి మురళి, గెద్దాడు నగేష్, భూక్యా శ్రీనివాస్, నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మాచర్ల శ్రీనివాస్, బోయిన విజయ్ కుమార్, పి.సత్యనారాయణచారి తదితరులు ఉన్నారు.
