మన్యం న్యూస్ భద్రాచలం/ సారపాక, ఫిబ్రవరి 14
భద్రాచలం పట్టణంలో మంగళవారం పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా గంజాయి పట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. భద్రాచలం ఏఎస్పి పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు పట్టణ ఎస్ఐ మధుప్రసాద్ తన సిబ్బందితో భద్రాచలం ఫారెస్ట్ చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో కర్ణాటక రాష్ట్రం బీదర్కి చెందిన ఐదుగురు వ్యక్తులు ఏపి 07 ఏడబ్ల్యూ 1383, ఏపి 09 సిహెచ్ 1733 నంబర్లు కలిగిన వోక్స్వేగాన్ కార్లలో అనుమానాస్పదంగా కనిపించారు. వారి వాహనాలను ఆపి తనిఖీ చేయగా నిషేధిత గంజాయి బయట పడింది. దీంతో వారి వద్ద 132 కిలోల గజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ సుమారు రూ 26. 40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆంధ్రా, ఒరిస్సా సరిహద్దుల్లో కొనుగోలు చేసి కర్ణాటక రాష్ట్రం బీదర్లో అమ్మడానికి అక్రమంగా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ గంజాయి తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులు సంజీవ్ కుమార్, అజయ్ దేవరాయ్, గణపతి చౌహాన్, సంగేష్ జాదవ్, బాన్సి బిక్కు రాథోడ్లను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ఈమేరకు కేసు నమోదుచేసి నిందితులను రిమాండ్కి తరలిస్తున్నట్లు భద్రాచలం సీఐ నాగరాజురెడ్డి తెలిపారు.
