మన్యం న్యూస్, ఇల్లందు టౌన్:పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో మెనూ సరిగా పాటించడం లేదని పీడీయస్యూ విద్యార్థి సంఘం నాయకులు అధికారుల దృష్టికి తీసుకుపోవడంతో శనివారం గిరిజన పోస్ట్ మెట్రిక్ వసతి గృహాన్ని ఇల్లెందు ఏటీడీఓ రూపాదేవి పరిశీలించడం జరిగింది. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న విద్యార్థిసంఘ నాయకులు పిడియస్యూ జిల్లా కోశాధికారి గణేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ గౌడ్, పిడియస్యూ ఇల్లందు పట్టణ కార్యదర్శి ఎ.పార్థసారథిలు మెనూ నియమ నిబంధనల ప్రకారం వాటిని పాటించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అందవలసిన మెనూ ఇవ్వకపోవడంతో నాసిరక భోజనం తినలేకపోతున్నారని దీనితో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతూ పరీక్షల సమయంలో నీరసంగా, నిరుత్సాహానికి లోనవుతున్న పరిస్థితి ఉందని అన్నారు. వసతి గృహంకు కూరగాయల టెండర్ దారులు కుల్లిన,ఎండలకు వాడిపోయిన కూరగాయలను పంపించి బిల్లులు నొక్కేస్తూ చేతులు దులుపుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధమైన కూరగాయలు వసతి గృహంకు పంపించినా వాటిని రిటన్ చేయకుండా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తున్నారని వారు ప్రశ్నించారు. మొత్తంగా గిరిజన శాఖ అధికారులు వసతి గృహాల పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబించడం మూలంగానే ఈ తరహా సంఘటనలు జరుగుతున్నాయన్నారు. మళ్లీ ఇటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగుచర్యలు చేపట్టాలని కోరారు. హాస్టల్ సమస్యలు అన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందేవిధంగా చర్యలు చేపడతామని ఏటీడీఏ అధికారి రూపాదేవి హామీ ఇచ్చినట్లు విద్యార్థిసంఘాల నాయకులు తెలిపారు.
