న్యూఢిల్లీ: పాన్-ఆధార్ కార్డ్ లింక్కు శుక్రవారమే తుదిగడువు. ఇదివరకు ఈ ఏడాది మార్చి 31వ తేదీని పాన్ను ఆధార్ కార్డ్తో లింక్ చేయడానికి చివరి తేదీగా నిర్ధారించింది.
ఈ గడువును ఆదాయపు పన్ను శాఖ ఇవ్వాళ్టికి అంటే జూన్ 30వ తేదీకి పొడిగించింది. ఈ గడువును కూడా పొడిగించడంపై రాత్రి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
గడువు ముగియడానికి కొన్ని గంటల ముందు- సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్.. ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. పాన్-ఆధార్ లింక్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఓ వివరణ ఇచ్చింది. లింక్ చేయడానికి పెనాల్టీ చెల్లించిన వెంటనే అది ఆమోదం పొందుతుందని తెలిపింది.
జూన్ 30వ తేదీ వరకు అంటే గడువు ముగిసే వరకు లింక్ అయినట్లు సమాచారం వారికి అందబోదని వివరించింది. అలాంటి కేసులను ఆదాయపు పన్ను శాఖ పరిగణనలోకి తీసుకుంటుందని, పాన్-ఆధార్ కార్డ్ లింక్ అయినట్టే భావిస్తామని సీబీడీటీ పేర్కొంది. జూన్ 30వ తేదీ లోపు పాన్ను ఆధార్ కార్డ్తో లింక్ చేయకపోతే, పాన్ పని చేయకుండా పోతుందనే విషయాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేసింది. లింక్ కాని పాన్ కార్డులు చెల్లుబాటు కాదని పేర్కొంది.
ఈ మేరకు ఆదాయపు పన్ను శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. దీన్ని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. ఆధార్-పాన్ లింకింగ్ కోసం పెనాల్టీ చెల్లించిన తరువాత చలాన్ డౌన్లోడ్ చేసుకోవడంలో పాన్ హోల్డర్లు ఇబ్బందులు ఎదుర్కొంటోన్నారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని, దీన్ని సరళీకృతం చేసినట్లు తెలిపింది.
పోర్టల్లో లాగిన్ అయిన తరువాత అక్కడ కనిపించే ఇ-పే ట్యాక్స్ ట్యాబ్లో చలాన్ చెల్లింపు ఏ స్థితిలో ఉందో తనిఖీ చేసుకోవచ్చని సూచించింది. పెనాల్టీ చెల్లింపు విజయవంతమైతే.. పాన్ హోల్డర్ తన కార్డును ఆధార్తో లింక్ చేయడానికి కంటిన్యూ చేయవచ్చు. దీనికోసం రిసీప్ట్ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదని వివరించింది.