ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థను వైసీపీ సర్కారు ప్రయోగాత్మకంగా తెరపైకి తెచ్చింది. వాలంటీర్లంటే వైసీపీ కార్యకర్తలే.! ఈ విషయాన్ని వైసీపీ ముఖ్య నేతలు పలు సందర్భాల్లో చెప్పారు, చెబుతూనే వున్నారు. వాలంటీర్ల పేరుతో వైసీపీ కార్యకర్తల కు ప్రభుత్వం నుంచి ‘గౌరవ వేతనం’ రూపంలో చెల్లింపులు జరుగుతుండడంపై నానా రకాల విమర్శలూ వస్తున్నాయి. మరోపక్క, వాలంటీర్ వ్యవస్థపై చాలా ఆరోపణలు కూడా లేకపోలేదు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ప్రతిసారీ వైసీపీ వాలంటీర్ వ్యవస్థపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ వస్తోంది. వాలంటీర్ వ్యవస్థను తీసెయ్యం: టీడీపీ మేం అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను తొలగించబోమంటూ వాలంటీర్లకు టీడీపీ గుడ్ న్యూస్ చెప్పింది.
వారికి మరింత గౌరవమైన హోదా కల్పిస్తామనీ, ఆ వ్యవస్థలోని లోపాల్ని తాము అధికారంలోకి వచ్చాక సరిదిద్దుతామని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య పేర్కొన్నారు. కాగా, ఎన్నికల విధులకు సంబంధించి కొందరు వాలంటీర్లు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి దూరంగా వుంచాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా వుంటే, వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించుకుని వైసీపీ తరఫున ప్రచారం చేయించుకుంటోంది అధికార పార్టీ.