ఓమిక్రాన్ సబ్వేరియంట్, ప్రమాదకరమైన వైరస్ ఎక్స్బీబీ.1.5 భారత్లోకి ప్రవేశించింది. ఈ వేరియంట్ తొలి కేసు గురజరాత్లో నమోదైంది. ప్రస్తుతం అమెరికాలో కరోనా వైరస్ కేసుల పెరుగుదలకు ఎక్స్బీబీ.1.5 వేరియంటే కారణమవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గత వేరియంట్ బీక్యూ.1 తో పోలిస్తే.. ఇది 120 రెట్లు ఎక్కువ అంటువ్యాధి అని అమెరికన్ పరిశోధకులు పేర్కొన్నారు. ఎక్స్బీబీ.1.5 వేరియంట్ను ఇటీవలనే అమెరికాలో కనుగొన్నారు. ఈ వేరియంట్ను ‘సూపర్ వేరియంట్’గా నిపుణులు పేర్కొంటున్నారు. ఒమిక్రాన్కు చెందిన రెండు వేర్వేరు బీఏ.2 సబ్- వేరియంట్ల సమ్మేళనమైన ఎక్స్బీబీ రూపాంతరమే ఈ ఎక్స్బీబీ.1.5. అదనపు మ్యుటేషన్ కారణంగా మానవ శరీరంలోని కణాలను అంటిపెట్టుకునే లక్షణం ఈ వేరియంట్కు అధికంగా ఉందని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయ వైరాలజిస్ట్ ఆండ్రూ పెకోస్జ్ చెప్పారు
. బీక్యూ, ఎక్స్బీబీ సబ్ వేరియంట్లతో పోల్చితే.. రోగనిరోధకతను ఏమార్చే సామర్థ్యం ఎక్కువ ఉండటంతో పాటు వ్యాప్తి అవకాశాలూ ఎక్కువేనని అంటువ్యాధుల నిపుణుడు ఎరిక్ ఫీగల్-డింగ్ తెలిపారు. ఎక్స్బీబీ.1.5 వేరియంట్ వల్ల గత వారం వ్యవధిలోనే అమెరికాలో కేసులు 21.7 శాతం నుంచి 41 శాతం పెరిగాయని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ వేరియంట్ కారణంగా న్యూయార్క్లో ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య పెరుగుతున్నాయి. సింగపూర్లో కనుగొన్న ఎక్స్బీబీ.1.5 వేరియంట్ కంటే.. 96 శాతం వేగంగా వ్యాపిస్తుందని అంటున్నారు. న్యూయార్క్లో ఈ కొత్త వేరియంట్ అక్టోబర్ నెలలోనే వ్యాప్తిచెందడం మొదలైందని ఎరిక్ స్పష్టం చేశారు. గుజరాత్లో మొదటి ఎక్స్బీబీ.1.5 కేసు నమోదులవడంతో పక్కన ఉన్న మహారాష్ట్ర అప్రమత్తమైంది. ‘రాష్ట్రంలో ప్రస్తుతం 275కు పైగా ఎక్స్బీబీ కేసులు ఉన్నాయి. అయితే ఎక్స్బీబీ.1.5 గురించి చాలా తక్కువగా తెలుసు. ఈ వేరియంట్పై దృష్టి సారించాం. ఇది ఎక్స్బీబీ రూపాంతరమే కాబట్టి కొన్ని మార్పులు ఉండొచ్చని సమాచారం. వైరస్ నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఇక్కడ 100 శాతం జీనోమ్ సీక్వెన్సింగ్ నిర్వహిస్తున్నాం’ అని ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు.