మన్యం న్యూస్, మణుగూరు, ఫిబ్రవరి 03: పంచాయతీల పరిపాలనపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మణుగూరు ఎక్స్ లెంట్ పాఠశాల యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు పాఠ్యాంశంలో ఉన్న విషయాలను నేరుగా విద్యార్థులకు శుక్రవారం పంచాయతీ సర్పంచ్ బచ్చల భారతి ద్వారా తెలియజేశారు. శానిటేషన్, వీధి దీపాలు, ఇంటిపన్నులతో పాటు ఏ విధంగా పంచాయతీ పరిపాలించాలి ఎంతమంది సిబ్బంది వుండాలి, ప్రభుత్వం నుండి వచ్చే నిధులు ఇలా అనేక విషయాలను సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి ద్వారా విద్యార్థులు పాఠాలు నేర్చుకున్నారు. పంచాయతీ పరిపాలనా విధానాన్ని విశదీకరించిన సర్పంచ్, కార్యదర్శిని విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ లెంట్ విద్యాసంస్థల చైర్మన్ యూసఫ్ షరీఫ్, ఉపాధ్యాయులు ఉష,మానస, విద్యార్థులు పాల్గొన్నారు.
