మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఫిబ్రవరి 05
పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మధ్యాహ్న భోజన కార్మికుల వేతనాలు పెంచాలని సిఐటియు అనేక పోరాటాల ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం 1000 రూపాయలు నుంచి రూ. 3 వేలకు పెంచిందని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సిఐటియు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి. పద్మ , ఎస్ డి సుల్తానా అన్నారు. ఆదివారం ప్రభుత్వము జీవో ను విడుదల చేయడంపట్ల సీఐటీయూ గా
హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో అప్పులు తెచ్చి వంటలు చేసి పెడుతున్న మధ్యాహ్న భోజన కార్మికుల పోరాటాల ఫలితంగా గత సంవత్సరం అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి ప్రకటించి అమలు చేయలేదని అన్నారు . గత సంవత్సరము నుండి జీవో విడుదల చేసి అమలు చేయాలని సిఐటియు చేసిన పోరాటాల ఫలితంగా శనివారం జీవో విడుదల చేసిందని అన్నారు. జీవో విడుదల చేయడం పట్ల సిఐటియు గా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఈ జీవోను గత సంవత్సరం అసెంబ్లీలో ప్రకటించిన నాటి నుంచి అమలు చేస్తూ ఏరియర్స్ తో సహా చెల్లించాలని కోరారు. వేతనాల పెంపు జీవో కోసం పోరాటాలు చేసిన మధ్యాహ్న భోజన కార్మికుల అభినందన సభలు అన్ని మండల, కేంద్రాలలో నిర్వహించాలని పిలుపునిచ్చారు.
ఈ నెల 12 న సీఐటీయూ జిల్లా కార్యలయంలో అభినందన సభ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
