మన్యంన్యూస్,మణుగూరు, ఫిబ్రవరి07: దళిత బంధు పేరుతో ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి మాయ చేసారని మోసంతో ప్రజలను భ్రమలకు గురి చేశారని తెలుగుదేశం పినపాక నియోజకవర్గం నాయకులు వట్టం నారాయణ దొర అన్నారు. ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 2023- 24 రాష్ట్ర బడ్జెట్లో ఇస్తానన్న గిరిజన బంధు ప్రస్తావన రాలేదన్నారు. బీసీలకు నామ మాత్రమే నిధులు కేటాయించారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. నిరుద్యోగ భృతి 3 వేల రూపాయలు ఏమయ్యా అని ప్రశ్నించారు. కొత్త సీసాలో పాత సార నింపారన్నారు. ప్రజల ఆశలకు నీరుకార్చారన్నారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్లో పెద్దగా పెంచింది ఏమీ లేదన్నారు. రైతు రుణమాఫీ 21,000 కోట్లు కేటాయించారని, అయినా వ్యవసాయ రంగానికి సరిపోదన్నారు. గతంలో కంటే ఎక్కువగా కేటాయించిన ఏమీ లేవన్నారు. మిగతా రాష్ట్రాల కంటే ప్రజా సంక్షేమానికి పెద్దగా నిధులను కేటాయించలేదన్నారు. భద్రాచలం పట్టణానికి 100 కోట్లు ప్రకటించి ప్రజలకు ఏమీ చేయలేదన్నారు. ప్రస్తుతం వెయ్యి కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి బడ్జెట్ లో ప్రస్తావించలేదన్నారు.
ఈ సమావేశంలో నియోజకవర్గ కార్యదర్శి వాసిరెడ్డి చలపతిరావు, సీనియర్ నాయకులు దొడ్డి కృష్ణ, మద్దెల భద్రయ్య, చెన్నకేశవులు, యార్లగడ్డ రాజు, కరిమునిషా బేగం, సిహెచ్ సతీష్,తాటి ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
