మన్యం న్యూస్,పినపాక, ఫిబ్రవరి 15..
పినపాక మండలంలోని అమరారం పంచాయతీలో వెలసిన నాగులమ్మ మహా జాతర భక్తి గీతాల సిడీని పినపాక మండల ఎంపీపి గుమ్మడి గాంధీ బుధవారం నాడు ఆలయం వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రముఖ ప్రజా కళాకారుడు సిద్దెల హుస్సేన్ రచించి ఆలపించిన గీతాలు 65 సంవత్సరాల చరిత్రను పాటల రూపంలో ప్రజలకు అర్థమయ్యే విధంగా, ఆదివాసి సాంస్కృతి సాంప్రదాయాలు వెల్లివిరిసేలా పాటలను రూపొందించడం సంతోషకరమన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసి చరిత్ర కనుమరుగవుతున్న వేళ ఇటువంటి రచనలు వనదేవతల చరిత్రను ప్రజలకు అర్థమయ్యే ధోరణిలో రాయడం కేవలం ప్రజా కళాకారులకే సాధ్యమవుతుందని తెలియజేశారు. ఈనెల 21న జాతర ప్రారంభం అవుతున్న సందర్భంగా అమరారం నాగులమ్మ జాతర పాటలను ముందుగానే పాటలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేయడం ద్వారా ప్రజలను భక్తి భావము వైపుగా మళ్ళించే విధంగా ఉంటుందని అభివర్ణించారు. వనదేవత జాతరలు నిర్వహించే దేవరబాలలు నిత్యం పవిత్రంగా, శుద్ధిగా ఉండి, అమ్మవార్లను ఆవహింపు చేసుకుంటూ ప్రజలకు తమదైన శైలిలో దర్శనము ఇస్తుంటారని, ప్రజలందరినీ నాగులమ్మ తల్లి చల్లగా చూడాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో భక్తి గీతాలు రచించి ఆలపించిన ప్రజా కళాకారుడు సిద్దెల హుస్సేన్, అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్, సర్పంచుల సంఘం అధ్యక్షులు మొగిలిపల్లి నరసింహారావు, ఆదివాసి ఐక్యవేదిక అధ్యక్షులు తోలెం శ్రీనివాస్ , పర్షిక రాములు, దేవర బాల కురుసం నాగార్జున, మహిళలు, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు అత్యధికంగా పాల్గొన్నారు.