మన్యం న్యూస్: జూలూరుపాడు, ఫిబ్రవరి 20, మండల కేంద్రంలోని భగత్ సింగ్ కాలనీకి చెందిన కనకయ్య అనే ప్రైవేట్ ఉపాధ్యాయుడు దశాబ్దాలుగా అనేక మంది విద్యార్థులకు పుస్తకపాఠాలతో పాటు, జీవిత పాఠాలను బోధించి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దారు. ఇటీవల కనకయ్య భార్య అనారోగ్యం బారినపడి మేజర్ ఆపరేషన్ చేయాల్సి ఉందన్న సంగతి తెలుసుకున్న కనకయ్య శిష్యులు తమ గురువుకి ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయించుకొని సోమవారం వారిని కలిసి కొంత ఆర్థిక సహాయాన్ని అందించి తమ గురుభక్తిని, మానవత్వాన్ని చాటుకున్నారు. అనారోగ్యం నుండి త్వరగా కోలుకొని ఇరువురు ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. కష్టకాలంలో తమను గుర్తుంచుకొని ఆర్థిక సహాయానందించిన విద్యార్థులకు ఉపాధ్యాయుడు కనకయ్య కృతజ్ఞతలు తెలిపారు. మానవతా విలువలు మాయమవుతున్న నేటి సమాజంలో దశాబ్ద కాలం నాటి గురువును గుర్తుంచుకొని, కష్టకాలంలో తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించిన యువతను మండలానికి చెందిన పలువురు ప్రశంసించారు. ఆర్థిక సహాయాన్ని అందించిన వారిలో మాడుగుల నాగరాజు, గోవర్ధన్, సెల్వరాజ్, తగరం అశోక్, కత్తి కృష్ణ, అరం కోటేష్, కాశిమల్ల సురేందర్, నిట్ట శీను,రవి, రమేష్,కృష్ణ,తదితరులు ఉన్నారు.