- అక్రమ నిర్మాణాలకు అడ్డా విద్యానగర్ గడ్డ!
- అనుమతులు తీసుకోరు.. నిబంధనలు పాటించరు
- ఇష్టారాజ్యంగా పెద్ద పెద్ద బిల్డింగుల నిర్మాణాలు
- గిరిజన ఇలాకాలో కమర్షియల్ దందా
- 1/70 చట్టానికి తూట్లు.. తగ్గని జోర్దార్
మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అనుకొని ఉన్న చుంచుపల్లి మండల పరిధిలోని విద్యానగర్ గ్రామ పంచాయతీ ఏరియాలో విచ్చలవిడిగా బిల్డింగ్ నిర్మాణ పనులు జోరుగా నడుస్తున్నాయి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కనీస నిబంధనలు పాటించకుండా మూడంతస్తులు నాలుగు అంతస్తులు ఐదంతస్తుల బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టి కమర్షియల్ వ్యాపారం కొనసాగిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. చుంచుపల్లి మండలం పూర్తిగా గిరిజన ప్రాంతం పైగా 1/70 చట్టం ఉన్న కూడా దీనిని ఉల్లంఘించి కొందరు బడా వ్యాపారులు బిల్డింగుల నిర్మాణాలకు శ్రీకారం చుడుతున్న పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ప్రజలు మండిపడుతున్నారు. ఇష్టారాజ్యంగా జరుగుతున్న నిర్మాణాలపై కొందరు ఫిర్యాదు చేస్తే అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు తప్ప గట్టి చర్యలు చేపట్టడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కూడా విద్యానగర్లో అక్రమ కట్టడాలు జోరందుకున్నాయని వీటిపై సంబంధిత అధికారులు దృష్టి సారించి నిర్మాణ పనులను నిలుపుదల చేయించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
*జాతీయ రహదారిపై కంకర ఇసుక డంపింగ్*
చుంచుపల్లి మండలం విద్యానగర్ జాతీయ రహదారి పక్కన కొద్దిరోజుల కిందట నుంచి కమర్షియల్ బిల్డింగ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనులకు సంబంధించిన ఇసుక కంకరను జాతీయ రహదారిపైనే కుప్పలుగా వేసి ఉంచడం వల్ల ఇటు ప్రజలకు అటు వాహనదారులకు ఇబ్బంది కరంగా ఉందని పలువురు పేర్కొంటున్నారు. నిర్మాణదారుడు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ రోడ్డుపైన మెటీరియల్ పోసి అనుమతులు తీసుకోకుండా పనులు చేయడం వల్ల ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. తక్షణమే అధికారులు స్పందించి నిర్మాణదారుడు రోడ్డుపై వేయించిన కంకర ఇసుక కుప్పలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. బిల్డింగ్ నిర్మాణ పనులు ముందుకు సాగకుండా అధికారులు శాశ్వత చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.